Friday, September 11, 2015

నేనొక కస్తూరిమృగంలా
తనసౌరభానికితానే
మత్తిలిపోయేలా వనచరుడినై
అడవిదారులవెంట ఆనందగా
పరుగిడతాను.
అది గ్రీష్మ రుతువు.
నడినెత్తిన సూరీడు
నాట్యంచేసే సమయం.
అప్పుడే దక్షిణ దిశనుంచి
మలయమారుతాలు వీచే
 శుభ ఘడియలుకూడా.

నేనప్పుడు దారితప్పి
వెదుకులాటలోపడ్డాను.
నాకవసరంలేనిదంతా
ఎదుటన ప్రత్యక్షమౌతుంది.
నాక్కావాల్సినదంతా
ఎండమావిలా దూరం
 దూరంగా జరుగుతూ
కనుమరుగైపోతుంది.

నా హృదయం ఒక్కుదుటన బయటకు గెంతి
నాట్యమాడడం మొదలెట్టింది.


ప్రకాశవంతంగా కనుపించే
 నాదృష్టికోణం క్రమేపీ కనుమరుగవుతున్నది.
దాన్ని చేజారకుండా గట్టిగా పట్టుకోవాలని
విశ్వప్రయత్నం చేస్తూనేవున్నాను.
అది తెలివిగా నానుండి తప్పించుకునిపోయి
నన్ను సందేహాస్పదుడుని గావించింది.
నేను కొరేదేదీ నాకు లభ్యంకాదు.
నాకు దొరికినవన్నీ నాకుపయోగపడనివే.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
[టాగూర్ తోటమాలిలోని కవితకు స్వేచ్చానువాదం.]

No comments:

Post a Comment