Monday, September 28, 2015

ఎండిపోయిన నదిని చూసినప్పుడల్లా
బీడువారుతున్న పొలాలకు
అది  ముఖద్వారమై
నిలుస్తున్నట్లనిపిస్తుంది.

దైవాధీనం బ్రదుకుల్లో
నిప్పులు పోస్తున్న నేతల
వాగ్దానంలా వేధిస్తుంది.

సింగపూరు కలల పూలను
ప్రతిపాకలో పూయిస్తున్న
మూర్ఖపు పెట్టెలా
ఏమారుస్తుంది.

మరా మరా అంటూ
రామాయణరచనకాద్యుడైన
వాల్మీకి మహర్షిని
వేళాకోళం చేస్తున్న ధోరణే కనిపిస్తుంది.

సాంకేతిక వలయాల్లో చిక్కుబడిపోతున్న
సాలీడులా గిల గిలా కొట్టుకుంటున్న
భారతం కట్టెదుటన  ద్యోతకమౌతున్నది.

వ్యవసాయం దండగని నుడివిన నేతకు
నీరాజనం పలుకుతూన్న జనావళికి
ముందున్న ముసళ్ళ పండుగను గుర్తు చేస్తున్న
అధ్యాయం దృశ్యమానమవుతున్నది.

నర్మగర్భంగా ఊడబెరుక్కున పొలాలరైతుల
వాడిపోయిన ముఖాలే ముఖచిత్రంగా మిగిలిపోతుందని
హెచ్చరికలు జారీ చేస్తున్న నది
భావితరాన్నే     జ్ఞప్తి  కితెస్తున్నది.
===========================

No comments:

Post a Comment