Monday, September 21, 2015

ఎగసాయం---
--------రావెల పురుషోత్తమరావు.
=================================


ఊరు ఊరంతా
బందెల దొడ్డిగా మారింది
మృత్యు గహ్వరానికీ దీనికే
భలేగా సామ్యం కుదిరింది.

తెల్లబంగారమని పండిస్తే
తెల్లటి వస్త్రమై
మనిషిని కప్పేసింది.

మిర్చి బాగుందనుకుంటే
ఆ దిగుబడి తగ్గిపోయి
ఘాటుగా గుండెకు తగిలింది.

వరిపంట గదాని
 నారునాటి నీరుపోస్తే
పొట్తకొచ్చిన కంకులను
మిడతలునమిలేసాయి.

చెరకు తీపిని తలచుకుని
ఎకరాలను సాగుచేస్తే
అదికాస్తా చేదువిషమై
కుటుంబాన్ని రోడ్డున  పడేసింది.

భీమా వస్తుందని కిస్తీలుకడితే
సొమ్ములుకాస్తా స్వాహా చేయబడింది.

అమ్మయి పెళ్ళి అబ్బాయి చదువు
ఇప్పుడిలా ప్రశ్నార్ధకమై మిగిలింది.

ఆశించిన పురుగును చంపలేని సం హారక మందు
మనుషులను చంపడంలో మొదటిస్థానానికెదిగింది.

పొలం గట్లమీద పిట్టల్లా రాలిపడుతున్న శవాగారం
రాజకీయానికి రాబందులా సహకరించింది.

చేతగాని నేతల వాగ్దానాలకొలిమిలో
రైతాంగం బ్రదుకు మాడి మసై
 బూడిదగా చివరకు మిగిలింది.

వ్యవసాయం ఆధునికంగా వ్యధార్త జీవితపు
యదార్ధ దృశ్యమై
 హృదయమంతటినీ కలచివేసింది.
===================================

No comments:

Post a Comment